Varasudu Movie Non-Theatrical Rights | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం స్పీడు మీదున్నాడు. వరుసగా కథలను ఓకే చేస్తూ సెట్స్పైకి తీసుకెళ్తున్నాడు. ఇటీవలే భారీ అంచనాలతో విడుదలైన ‘బీస్ట్’ తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకులే కాదు అభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక విజయ్కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ కూడా ఈయన సినిమాలకు మంచి కలెక్షన్లు వస్తుంటాయి. ప్రస్తుతం ఈయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ అనే ద్విభాషా చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర శరవేగంగా షూటింగ్ జరుగుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన విజయ్ పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ చిత్రం విడుదలకు ముందే భారీగా నాన్-థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంటున్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ హక్కులు దాదాపు రూ.60 కోట్లకు అమ్ముడయ్యాయట. అంతేకాకుండా శాటీలైట్ హక్కులను సన్ టీవి సంస్థ 50 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇక ఆడియో రైట్స్ను రూ.10 కోట్లకు టీ-సిరీస్ సంస్థ సొంతం చేసుకుందట. ఈ లెక్కన చూసుకుంటే వారసుడు సినిమాకు విడుదలకు ముందే రూ.120 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లే. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా విడుదలకు 4నెలల ముందే ఈ స్థాయిలో నాన్-థియేట్రికల్ హక్కులు అమ్ముడవడం విశేషం అనే చెప్పాలి.
ఈ చిత్రంలో విజయ్కు జోడీగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.