తేజస్ కంచర్ల హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ‘ఓరి మాయలోడా..’ అనే లిరికల్ సాంగ్ను అగ్ర కథానాయిక శ్రీలీల విడుదల చేసింది.
ప్రవీణ్ లక్కరాజ్ సంగీతాన్నందించిన ఈ పాటను శ్రీనివాసమౌళి రాశారు. స్ఫూర్తి జితేందర్ ఆలపించారు. పల్లెటూరి యువకుడి ప్రేమలో పడిన పట్నం అమ్మాయి తన మనసులోని ప్రేమను వ్యక్తం చేసే సందర్భంలో వచ్చే పాట ఇదని, గ్రామీణ అందాలను ఆవిష్కరించే విజువల్స్తో ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.