కథాంశాలపరంగా ప్రయోగాలకు పెద్దపీట వేస్తారు తమిళ అగ్ర హీరో సూర్య. వినూత్న పాత్రల్లో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని తపిస్తారు. ప్రస్తుతం ఆయన పీరియాడిక్ చిత్రం ‘కంగువ’లో నటిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో విడుదల చేసిన ఫస్ట్గ్లింప్స్ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సూర్య బాలీవుడ్ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం రంగ్దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో సూర్య ఓ చిత్రానికి అంగీకరించారని తెలిసింది. ఈ సినిమా విషయంలో ఇటీవల ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, పీరియాడిక్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాకు ‘కర్ణ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని తెలిసింది. రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.