Upasana | తెలంగాణ రాష్ట్రానికి చెందిన గొప్ప సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని ఒక ప్రముఖ కాలేజీలో తెలుగు విద్యార్థుల ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ వేడుకలు ఎంతో ఉత్సాహంగా, భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బతుకమ్మను నెత్తిపై ఎత్తుకుని విద్యార్థులతో కలిసి పాటలు పాడుతూ సీఎం రేఖా గుప్తా, ఉపాసన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను రేఖా గుప్తా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
“ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదు. ఇది మాతృత్వానికి, జీవానికి, ప్రకృతికి గల గౌరవానికి ప్రతీక. తెలంగాణ మహిళలు తరతరాలుగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం, భారతదేశ సాంస్కృతిక ఐక్యతకు చిహ్నం. ఢిల్లీలోని తెలుగు విద్యార్థులు ఇలా నిర్వహించటం అభినందనీయం. రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేస్తుంది.” అని పేర్కొన్నారు. రేఖా గుప్తా ట్వీట్ను ఉపాసన కొణిదెల రీట్వీట్ చేస్తూ, “తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ, మాతో కలిసి బతుకమ్మ జరుపుకున్నందుకు ఢిల్లీ ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు,” అంటూ స్పందించారు. ఉపాసన హాజరు కావడం ఈ వేడుకకు మరింత ప్రజ్ఞను తీసుకొచ్చిందని అక్కడి తెలుగు విద్యార్థులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రేఖా గుప్తా, ఉపాసన పాల్గొన్న బతుకమ్మ వేడుకల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పూలతో తయారుచేసిన బతుకమ్మలు, సంప్రదాయ తెలంగాణ దుస్తులలో విద్యార్థులు, అతిథులు ఇవన్నీ ఢిల్లీలో ఒక చిన్న తెలంగాణను గుర్తు చేసాయి. తెలంగాణ సాంస్కృతిక సంపదను దేశ రాజధానిలో కూడా ఇలా ఘనంగా నిర్వహించడం అనేది సాంస్కృతిక ఐక్యతకు ప్రతీక. బతుకమ్మ వేడుకల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రముఖులు పాల్గొనడం, యువతతో కలిసి సంబరాల్లో మునిగితేలడం మన సంప్రదాయాల విలువను దేశవ్యాప్తంగా చాటింది.
Rekha Gupta ji you are an amazing CM. Thank you for embracing our Telangana culture and celebrating Bathukamma Panduga with us. Jai Hind. 🙏❤️ https://t.co/wY7xGYp9DS
— Upasana Konidela (@upasanakonidela) September 27, 2025