అగ్ర హీరో చిరంజీవి కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి చేరింది. యు.కె.పార్లమెంట్లో గౌరవ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికీ, సమాజానికీ సేవలందించినందుకుగాను ఈ పురస్కారం చిరంజీవిని వరించింది. యు.కె.కి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా ఈనెల 19న యు.కె.పార్లమెంట్లో చిరంజీవిని సన్మానిస్తారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే వేదికపై యూకేలో పేరెన్నికగన్న బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవికి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనున్నది. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అందిస్తున్న తొలి లైఫ్టైమ్ అఛీవ్మెంట్ అవార్డు ఇదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్, మార్చి 14 ( నమస్తే తెలంగాణ ) : యూకే ‘లైఫ్ టైం అచీవ్మెంట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్’ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. సినిమా, ప్రజాసేవ, సేవారంగాల్లో విశేషంగా చేసిన సేవలకు గుర్తింపుగా చిరంజీవిని ఈ జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక చేస్తూ అధికార లేబర్ పార్టీకి చెందిన ఎంపీలు నవేందు మిశ్రా, సోజన్ జోసఫ్, బాబ్ బ్లాక్మెన్ ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఈ అవార్డును ఈ నెల 19న చిరంజీవి అందుకోనున్నారు.