నలభయ్యవ పడిలో కూడా వన్నెతరగని అందంతో అలరారుతున్నది తమిళ సోయగం త్రిష. ‘పొన్నియన్ సెల్వన్’ ‘లియో’ చిత్రాలతో తిరుగులేని విజయాలను సొంతం చేసుకొని ఫామ్లోకి వచ్చిందీ అమ్మడు. తాజాగా ఈ భామ బాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. పదమూడేండ్ల విరామం తర్వాత ఆమె హిందీ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే..సల్మాన్ఖాన్ కథానాయకుడిగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో ‘ది బుల్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో త్రిషను కథానాయికగా ఖరారు చేశారు. 2010లో అక్షయ్కుమార్ ‘కట్టామీటా’ చిత్రం ద్వారా త్రిష బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా..దక్షిణాదిన బిజీగా ఉండటంతో తిరస్కరించింది. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ భామ బాలీవుడ్లో సైతం సత్తా చాటాలనే ఆలోచనతో ఉందని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని కరణ్జోహార్ నిర్మిస్తున్నారు.