‘యానిమల్’ చిత్రంలో జోయాగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కథానాయిక త్రిప్తి డిమ్రీ. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిందీ అమ్మడు. ‘యానిమల్’ తర్వాత ఈ ఢిల్లీ భామకు ఇన్స్టాలో ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. రణబీర్ కపూర్, సందీప్రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో రష్మిక కథానాయిక కాగా, త్రిప్తి డిమ్రీ జోయా పాత్రలో అలరించింది.
తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న త్రిప్తి ‘యానిమల్’ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. ‘సినీ పరిశ్రమలో ప్రయాణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎత్తుపల్లాలు సహజం. ప్రతి దాని నుంచీ పాఠాలు నేర్చుకోవాలి. నా కెరీర్ విషయంలో ఎప్పుడూ బాధపడలేదు. ‘యానిమల్’తో నాకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అని ముందే ఊహించా. కాకపోతే నా పాత్రకు ఇంతటి పాపులారిటీ వస్తుందని అస్సలు అనుకోలేదు.
నా జీవితంలో ప్రత్యేకమైన క్షణాలివి. రోజూ నిద్రపోయే ముందు చిత్రబృందాన్ని గుర్తుచేసుకొని థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు కూడా ఎప్పుడూ కృతజ్ఞురాలినే’ అంటూ భావోద్వేగానికి గురైంది. మరోవైపు ఈ సొగసరి తెలుగులోనూ అవకాశాల కోసం అన్వేషిస్తోందనేది టాలీవుడ్ టాక్. విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కాంబో ప్రాజెక్టులో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.