కరోనా తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితి దారుణంగా మారింది. షూటింగ్లు స్తంభించడం, థియేటర్స్ మూతపడడంతో సినీ కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు.ఈ క్రమంలో ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న చిరంజీవి పలువురు సినీ పెద్దలతో పలుమార్లు మీటింగ్లు జరిపారు.తాజాగా మరోసారి చిరంజీవి ఇంట్లో సినీ పెద్దలంతా కలిసి పలు విషయాలపై చర్చించారు.
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి సినీ పరిశ్రమకు సంబంధించి చర్చించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లాల్సిన అన్ని అంశాల గురించి ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా టిక్కెట్ రేట్ల విషయం ముఖ్యమంత్రి జగన్తో చర్చించాలనీ, చిన్న సినిమాల మనుగడ కోసం ఐదో షో అనుమతి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనీ తీర్మానించారు.
సినీ పరిశ్రమలో అన్ని విభాగాల్లో ఎదురవుతున్న సమస్యల గురించి, వాటి పరిష్కారం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఈ నెల 21 నుంచి 31లోగా చిరంజీవి బృందం ఏపీ సీఎంను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, నాగార్జున, అల్లు అరవింద్, సురేశ్బాబు, దిల్ రాజు, కె.ఎస్.రామారావు, దామోదర ప్రసాద్, సుప్రియ, సునీల్ నారంగ్, స్రవంతి రవికిశోర్, సి.కల్యాణ్, ఎన్వీ ప్రసాద్, కొరటాల శివ, వి.వి.వినాయక్, జెమినీ కిరణ్, భోగవల్లి బాబీ, విక్కీ, వంశీ తదితరులు పాల్గొన్నారు.