Tollywood | సినీ నిర్మాత పొలిశెట్టి రాంబాబు (58) మరణించారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాంబాబు.. శనివారం సాయంత్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పొలిశెట్టి రాంబాబు మొదట ప్రజానాట్యమండలి కళాకారుడిగా పనిచేశారు. ఆయనకు భార్య సంధ్యారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సినీ నటుడు అల్లరి నరేశ్తో గోపి(గోడ మీద పిల్లి), లక్ష్మీపుత్రుడు సినిమాలను తీశారు. ఆయన కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఇటీవల హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు రోజులపాటు వెంటిలేటర్పై ఉండగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. దాంతో అమెరికాలో ఉంటున్న చిన్నకుమార్తె శుక్రవారం మధ్యాహ్నం12 గంటలకు హైదరాబాద్కు చేరుకుంది. అయితే అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత వెంటిలేటర్ను తొలగించారు. దాంతో మిర్యాలగూడలో ఉన్న ఆయన బంధువులు, స్నేహితులకు విషయంతో తెలియడంతో ఆయన శుక్రవారం సాయంత్రమే ఆయన మృతి చెందినట్లు ప్రకటించి పట్టణంలో ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు రాంబాబును శుక్రవారం రాత్రి మిర్యాలగూడకు తీసుకొచ్చి కొన ఊపిరితో ఉన్న ఆయనను మరో ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. బతికి ఉన్నాడనే సమాచారంతో శనివారం తెల్లవారుజామున పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించారు. పగలంతా ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆదివారం మధ్యాహ్నం పెద్దకుమార్తె అంజు చేతుల మీదుగా హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.