తెలుగు ఇండస్ట్రీలో మరో శకానికి ముగింపు పడింది. సంగీత సినీ వినీలాకాశంలో మూడున్నర దశాబ్దాల పైగా వేలాది పాటలు రాసిన కలం మూగబోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు.
వేటూరి సుందర రామ్మూర్తి తర్వాత ఆ స్థాయిలో తెలుగు పాటకు గౌరవం తీసుకొచ్చిన కవి ఈయన. అత్యంత సరళమైన పదాలతో వాడుకభాషలో ఈయన రాసిన ఎన్నో వందల పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలాగే నిలిచిపోయాయి. కొన్ని రోజుల కింద నిమోనియా కారణంగా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30 సాయంత్రం మరణించారు. నవంబర్ 24న ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నారు సిరివెన్నెల. అయితే ఆయన ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని.. త్వరగానే కోరుకుంటున్నారని రెండు రోజుల కింద కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ మంగళవారం మధ్యాహ్నం నుంచి సిరివెన్నెల ఆరోగ్య ఒక్కసారిగా విషమించింది. వైద్య బృందం ప్రతిక్షణం ఆయనను కాపాడటానికి ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.
ఆయన కోలుకోవాలని అభిమానుల దేవుడిని ప్రార్థించినా కూడా కనికరించలేదు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు కిమ్స్ హాస్పిటల్ కు బయల్దేరారు. ప్రస్తుతం అక్కడ గంభీరమైన వాతావరణం ఉంది. ఎలాగైనా ఆయన కోలుకొని రావాలని కోట్లాది మంది చేసిన ప్రార్థనలు వృధా అయిపోయాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు అభిమానులు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చంబోలు సీతారామశాస్త్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆయన జన్మించారు. తండ్రి సీవీ యోగి వేదపండితుడు, తల్లి అమ్మాజి గృహిణి. సీతారామశాస్త్రికి ఇద్దరు అక్కలు, ఇద్దరు సోదరులు. అనకాపల్లిలోని మున్సిపల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరారు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేశారు. అనంతరం అనకాపల్లిలోని బీఎస్ఎన్ఎల్ శాఖలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో ఆర్ఎస్ఎస్లో చురుకైన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి సందేశాత్మక, దేశభక్తి గీతాలు రాయడం సీతారామశాస్త్రికి అలవాటు. అనేక కార్యక్రమాల్లో సైతం సొంతంగా పాటలు రాసి అలపించేవారు.
1983లో కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ను కలిసే అవకాశం సీతారామశాస్త్రికి దక్కింది. ఆ సమయంలో సీతారామశాస్త్రిని ప్రతిభను కె.విశ్వనాథ్ గుర్తించారు. ఆయన చిత్రంలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. అలా తొలిసారి సిరివెన్నెల సినిమాలో పాటలు రాసే అవకాశాన్ని సీతారామశాస్త్రి దక్కించుకున్నారు. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలు ఎంతగానో పాపులర్ అయ్యాయి. దీంతో ఆ సినిమా పేరే సీతారామశాస్త్రి ఇంటి పేరుగా మారింది. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో సిరివెన్నెల మూడు వేలకు పైగా పాటలు రాశారు. విధాత తలపున ప్రభవించినది.. సిరివెన్నెల రాసిన తొలి పాట. చివరిసారిగా.. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంలో చిట్టు అడుగు అనే పాట రాశారు.
సినీ సాహిత్యరంగంలో చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం సిరివెన్నెల సీతారామశాస్త్రిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన సినీ కెరీర్లో మొత్తం 11 నంది అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
shiva shankar master | వెన్నెముక గాయం.. ఎనిమిదేళ్లు మంచంపైనే.. అయినా 800 సినిమాలకు కొరియోగ్రఫీ
shiva shankar | శివ శంకర్ మాస్టర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
Sirivennela | తొలి పాటకే ప్రేక్షకుల గుండెల్లో చోటు