దేశంలో కరోనా విళయతాండవం చేస్తుంది. ఎంతోమంది ప్రజలతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన పడి మరణిస్తున్నారు. తాజాగా మరో చేదు వార్త వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు పొట్టి వీరయ్య మరణించి 24 గంటలు కూడా గడవక ముందే మరో మరణవార్త వచ్చింది. దివంగత హీరోలు శ్రీహరి, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలతో సినిమాలు తెరకెక్కించిన అనుభవం ఉన్న దర్శకుడు సాయి బాలాజీ కన్నుమూసారు. ఆరోగ్యంగానే ఉన్న ఈయనకు కొన్ని రోజుల కింద కరోనా సోకింది. దర్శకుడిగా మూడు సినిమాలే చేసినా కూడా సీనియర్ దర్శకులు చాలా మంది దగ్గర ఈయన పని చేసారు.
ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈయన కథ, స్క్రీన్ ప్లే సహకారం అందించారు. కొన్ని రోజుల కింద కరోనా బారిన పడిన ఈయన.. ఆరోగ్యం విషమించడంతో ఎప్రిల్ 26 మధ్యాహ్నం మరణించారు. ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతుడిగా ఈయనకు పేరుంది. కాకపోతే చేసిన మూడు సినిమాలు కూడా నిరాశ పరచడంతో బ్రేక్ రాలేదు. రియల్ స్టార్ శ్రీహరి, రాశీ జంటగా ‘శివాజీ’ , 2001లో ‘ఒరేయ్ తమ్ముడు’ సినిమాలను తెరకెక్కించాడు సాయి బాలాజీ. అలాగే ఉదయ్ కిరణ్ చివరి సినిమా ‘జై శ్రీరామ్’ సినిమాను కూడా ఈయన డైరెక్ట్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా జయంత్ సి పరాన్జీ తెరకెక్కించిన బ్లాక్బస్టర్ సినిమా ‘బావగారు బాగున్నారా’కి స్క్రీన్ ప్లే రచయిత ఈయన. అలాగే ప్రముఖ టీవీ సీరియల్స్కు కూడా పని చేశారు సాయి బాలాజీ. స్క్రీన్ ప్లే రాయడంలో ఈయనకు మంచి పట్టుంది. అలాగే తెలుగు సినిమాలే కాకుండా ప్రపంచ సినిమాపై కూడా మంచి పట్టున్న వ్యక్తి సాయి బాలాజీ. కరోనా కాటుకు ఈయన బలైపోవడంతో సన్నిహితులతో పాటు తెలుగు సినీ ప్రముఖులు కూడా విషాదంలో మునిగిపోయారు.