కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినీ తారలందరూ మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో వివిధ రాష్ర్టాల్లో అన్లాక్ ప్రక్రియ మొదలైంది. షూటింగ్లకు అనుమతి లభించడంతో సినిమాలు సెట్స్మీదకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. అగ్రకథానాయికలు సైతం గత మూడు నెలల విరామానికి బ్రేక్నిస్తూ షూటింగ్స్లో పాల్గొనడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఇన్నాళ్ల బోర్డమ్కు స్వస్తిపలికి కెమెరా ముందుకొచ్చి అభిమానుల్ని అలరించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అగ్రనాయికల ఆగమనంతో షూటింగ్ లొకేషన్స్ కొత్త శోభతో కళకళలాడుతున్నాయి.
గతకొన్నాళ్లుగా బాలీవుడ్ చిత్రం ‘గుడ్బై’ షూటింగ్తో బిజీగా ఉంది రష్మిక మందన్న. కొవిడ్ భయాలు వీడకపోయినా ధైర్యంగా చిత్రీకరణలో పాల్గొంటున్నది ఈ కూర్గ్ సుందరి. మహారాష్ట్ర ప్రభుత్వం సినిమా షూటింగ్లకు అనుమతులు ఇచ్చిన వెంటనే ముంబయి పయనమైన రష్మిక మందన్న తన తొలి బాలీవుడ్ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో పడింది. అమితాబ్బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వికాస్భల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో ఐదు సినిమాల్ని అంగీకరించింది రష్మిక మందన్న. బిజీ షెడ్యూల్ కారణంగా డేట్స్ వృథా కాకూడదనే ఆలోచనతో అందరికంటే ముందుగానే రష్మిక షూటింగ్ను మొదలుపెట్టినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ‘గుడ్బై సినిమాతోనే ఆమె బాలీవుడ్లో అరంగేట్రం చేయబోతుండటం గమనార్హం.
ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే వచ్చే నెల ప్రథమార్థంలో ఆమె ‘పుష్ప’ సెట్స్లో అడుగుపెట్టనున్నట్లు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ మూలంగా లభించిన విరామ సమయాన్ని కుటుంబంతో సంతోషంగా గడిపింది పంజాబీ సుందరి రకుల్ప్రీత్సింగ్. మరోవైపు ఫిట్సెస్ను కాపాడుకోవడంపై దృష్టిపెట్టిన ఆమె లాక్డౌన్ 2.0 తర్వాత తొలిసారి కెమెరాముందుకొచ్చింది. మంగళవారం బాలీవుడ్ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టింది. మేకప్ వేసుకుంటున్న ఓ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ‘వృత్తిలో ఉండే ఆనందాన్ని చాలా రోజుల తర్వాత ఆస్వాదిస్తున్నా’ అంటూ క్యాప్షన్ను జోడించింది. అయితే ఏ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నది మాత్రం రకుల్ వెల్లడించలేదు. ప్రస్తుతం హిందీలో నాలుగు సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది రకుల్.
సెకండ్వేవ్ అనంతరం తెలుగు చిత్రసీమలోని కథానాయికల్లో అందరికంటే ముందుగా మెహరీన్ షూటింగ్ సెట్స్లో అడుగుపెట్టింది ప్రస్తుతం మారుతి దర్శకత్వపర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఓ ప్రేమకథా చిత్రంలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తోంది. జూన్ ఆరంభం నుంచి ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నదామె. పరిమిత యూనిట్ సభ్యులు, లొకేషన్స్తో ప్రయోగాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇందులో సంతోష్శోభన్ హీరోగా నటిస్తున్నారు.
లాక్డౌన్ సమయాన్ని ముంబయిలో ప్రియుడు శంతనుతో ఏకాంతంగా ఆస్వాదిస్తోంది శృతిహాసన్. తిరిగి సినిమా షూటింగ్లను మొదలుపెట్టేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆమె ఇటీవల ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్నది. ‘బ్యాక్ టూ వర్క్’ అంటూ యాడ్ కోసం వానిటీ వ్యాన్లో మేకప్ వేసుకుంటున్న ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్చేసింది. త్వరలో ఆమె ‘సలార్’ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అలియాభట్ ‘గంగూబాయి కతియావాడి’ షూటింగ్ ముంబయిలో శుక్రవారం నుంచి మొదలుకానున్నట్లు సమాచారం. వీరితో పాటు మరికొందరు అగ్రకథానాయికలు త్వరలో షూటింగ్లలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.