అమరావతి : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో భేటీ అనంతరం సినీ నటుడు అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు వారాల్లోనే వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి కీలక ప్రకటన వస్తుందని అలీ మీడియాకు వెల్లడించారు. అలీ తన భార్యతో కలిసి జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అలీ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ను మర్యాదపూర్వకంగానే కలిశాను. రెండు వారాల్లోనే పార్టీ ఆఫీసు నుంచి ప్రకటన ఉంటుంది. సీఎం జగన్తో భేటీ సందర్భంగా కొంతమంది పెద్దలను కలవడం జరిగింది. కొడాలినాని, కన్నబాబుతో పాటు పలవురు ఎమ్మెల్యేలను కలిశాను అని అలీ స్పష్టం చేశారు.
నేను ఎప్పుడూ పదవులను ఆశించలేదు అని అలీ పేర్కొన్నారు. పార్టీకి సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాకముందే నుంచే ఆ ఫ్యామిలీతో నాకు సంబంధాలు ఉన్నాయి. 2014లో పాదయాత్ర చేసినప్పుడు కూడా జగన్ను కలిశాను. మొన్న ఎన్నికలప్పుడే మాకు పరిచయం కాలేదు. ఎప్పట్నుంచో మాకు పరిచయాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు నాకు అవకాశం కల్పించారు. నాకు వీలు కాలేదు. ఫేస్ వాల్యూ చూసి ఓటు ఎవరూ వేయరు. షూటింగ్స్ కు దూరంగా ఉండాలి. కాబట్టి పోటీకి దూరంగా ఉన్నాను అని అలీ స్పష్టం చేశారు.
నా మ్యారేజ్ డే సందర్భంగా జగన్ను కలుద్దామనుకున్నాను. కానీ వీలు కాలేదు. ఇవాళ కలిశాను. మొన్న సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాం. నా కంటే ముందు మీకే న్యూస్ అందుతుంది. రాజ్యసభ సీటు విషయం నాకు తెలియదని అలీ సమాధానం దాటవేశారు.