‘కరోనా అనంతరం సినీ రంగంలో చాలా మార్పులొచ్చాయి. ఓటీటీల వల్ల ప్రేక్షకులకు ప్రపంచ సినిమాతో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం సాధారణ కథాంశాలతో వారిని థియేటర్లకు రప్పించలేం’ అన్నారు అగ్ర నిర్మాత బన్నీ వాసు. జీఏ2 సంస్థ పతాకంపై ఆయన నిర్మించిన ‘పక్కా కమర్షియల్’ చిత్రం జూలై 1న విడుదలకానుంది. నేడు బన్నీ వాసు జన్మదినం. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు.
ప్రస్తుత ప్రేక్షకులు ఏదో కొత్తదనం ఉంటేనే థియేటర్కు వస్తున్నారు. కరోనా తర్వాత నిర్మాతల బాధ్యత కూడా క్లిష్టంగా మారింది. ఇప్పుడు సినిమా ట్రేడ్ను ఎవరైనా సరే కొత్తగా అర్థం చేసుకోవాల్సిందే. ఓ కథను ఎంచుకునే ముందు…అది థియేటర్ రిలీజ్ కోసమా? లేక ఓటీటీ కోసమా? అనే విషయంలో స్పష్టతకు రావాలి. సరైన అవగాహన లేకుండా ముందుకెళ్తే తీవ్రంగా నష్టపోయే పరిస్థితులున్నాయి. కరోనా తర్వాత సినీరంగంలో వచ్చిన మార్పుల్ని ఆకళింపు చేసుకోవడానికి నిర్మాతలకు మరో రెండుమూడేళ్లు పడుతుందనుకుంటున్నా.
మా సంస్థ నిర్మించిన ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయబోతున్నాం. గోపీచంద్ శైలి యాక్షన్, దర్శకుడు మారుతి తరహా కామెడీ కలబోతగా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. ఎలాంటి సందేశాలు, సీరియస్ అంశాల ప్రస్తావన లేకుండా ఆద్యంతం నవ్వుల్ని పండిస్తుంది. ఇక మా జీఏ2 సంస్థ నిర్మించిన ‘18పేజీస్’ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నాం. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ దసరా రిలీజ్కు సిద్ధంగా ఉంది.
చందు మొండేటితో కూడా ఓ సినిమా చేయబోతున్నాం. శ్రీకాకుళంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా కథ తయారుచేస్తున్నాం. పవన్ సాదినేని దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుంది. ‘పుష్ప-2’ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ వివరాల్ని అక్టోబర్లో తెలియజేస్తాం. థియేటర్, ఓటీటీ రిలీజ్ మధ్య వ్యవధి ఎక్కువగా ఉండాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని బాలీవుడ్లో ఒప్పందం కుదిరినట్లుగా తెలిసింది. దక్షిణాదిన కూడా ఆ దిశగా ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ చర్చలు జరుపుతున్నారు.
టికెట్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. పెద్ద సినిమాలకు భారీ ఓపెనింగ్స్తో డబ్బులు రావొచ్చేమోకానీ..హై టికెట్ రేట్ వల్ల భవిష్యత్తులో ప్రేక్షకులు థియేటర్కు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. అటు ప్రేక్షకులకు ఇటు నిర్మాతలకు ఆమోదయోగ్యంగా టికెట్ ధరలు ఉండాలన్నది మా జీఏ2 సంస్థ అభిమతం.