భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా ‘ఇందిరాగాంధీ’ పేరుతో మూడేళ్ల క్రితం ఓ వెబ్సిరీస్కు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో అగ్ర కథానాయిక విద్యాబాలన్ టైటిల్ రోల్ని పోషించబోతున్నట్లు ప్రకటించారు. విద్యాబాలన్ భర్త సిద్ధార్థ రాయ్ కపూర్ నిర్మాతగా ఈ వెబ్సిరీస్కు సన్నాహాలు జరిగాయి. టెలివిజన్ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.
వివాదాస్పద రాజకీయ నేతల జీవిత కథల్ని తెరకెక్కించడం ప్రస్తుతం ఉన్న రాజకీయ, సామాజిక వాతావరణంలో శ్రేయస్కరం కాదనే అభిప్రాయంతో ఇందిరాగాంధీ బయోపిక్ను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు విద్యాబాలన్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. గతంలో సీనియర్ కథానాయిక మనీషా కొయిరాలా సైతం ఇందిరాగాంధీ బయోపిక్లో నటించడానికి అంగీకరించింది. ‘ఇందిరాగాంధీ..ఓ ట్రిస్ట్ విత్ డెస్టినీ’ పేరుతో ఆరంభమైన ఈ బయోపిక్ కోసం మనీషా కొయిరాల ముక్కు సర్జరీ కోసం కూడా సిద్ధపడింది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ కూడా ఆరంభ దశలోనే ఆగిపోయింది. తాను ఇందిరాగాంధీ బయోపిక్లో నటిస్తున్నట్లు గతేడాది అగ్ర కథానాయిక కంగనారనౌత్ ప్రకటించింది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు.