Chiranjeevi | ‘దేశంకోసం ప్రాణాలను పణంగా పెట్టే వీరసైనికుల గాధలపై రీసెర్చ్ చేసి, నేరుగా వారిని కలిసి, వారి సూచనలను కూడా తీసుకొని తయారు చేసుకున్న కథ ‘ఆపరేషన్ వాలంటైన్’. ఇలాంటి కథలు చూసినప్పుడు మనసంతా ఉద్వేగంతో నిండిపోతుంది. లేచి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. అందుకే.. ఈ వేడుకకు వరుణ్ ఆహ్వానించినప్పుడు అదో బాధ్యతగా, సదావకాశంగా భావించాను.’ అని పద్మవిభూషణ్ చిరంజీవి అన్నారు. వరుణ్తేజ్ కథానాయకుడిగా రూపొందిన ఏరియల్ వార్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్సింగ్ హడా దర్శకుడు. సందీప్ ముద్దా నిర్మాత. మార్చి 1న పానిండియా స్థాయిలో సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడారు.
‘వరుణ్ హీరో కావడానికి కారణం నేనే అయినా.. నటుడిగా నన్నెప్పుడూ తను అనుసరించలేదు. తను చేసిన పదమూడు సినిమాల్లో పదమూడు రకాల పాత్రలు చేశాడు. విభిన్నమైన పాత్రలతో మంచి నటుడిగా ఎదిగాడు. ఈ విషయంలో వరుణ్ని కచ్చితంగా అభినందించాలి. సినిమా బాగా వచ్చిందని అందరూ అంటున్నారు. నటీనటులు, సాంకేతికనిపుణులు అందరూ మనసు పెట్టి చేసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి.’ అని చిరంజీవి ఆకాంక్షించారు. రక్తాన్నీ, స్వేదాన్ని ధారపోసి చేసిన సినిమా ఇదని, బాధ్యతగా భావించి ఈ సినిమా చేశామని, తన కెరీర్లోనే ఇది ప్రత్యేకమైన సినిమా అని వరుణ్తేజ్ అన్నారు. దేశాన్ని కాపాడే సైనికుడిగా వరుణ్ నటించడం పట్ల నాగబాబు ఆనందం వెలిబుచ్చారు. ఇంకా యూనిట్సభ్యులందరూ మాట్లాడారు.