“సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత నేను సైన్ చేసిన తెలుగు సినిమా ఇదే. ఇది అద్భుతమైన కథ. ఇందులో హీరోయిన్ని ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకూ రాలేదనుకుంటాను. ఈ కథతో చాలా కనెక్ట్ అయ్యాను. ఇందులో అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మంచి టెక్నికల్ టీమ్ పని చేసింది. కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసే సినిమా ఇది’ అని కథానాయిక ఐశ్వర్య రాజేశ్ అన్నారు. తిరువీర్కి జోడీగా ఆమె నటించిన గ్రామీణ నేపథ్య రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకుడు.
మహేశ్వరరెడ్డి మూలి నిర్మాత. శనివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఐశ్వర్య రాజేష్ మాట్లాడారు. ‘ఫ్యామిలీస్కి నచ్చే సినిమాలు ఎక్కువకాలం గుర్తుండిపోతాయ్. అలాంటి సినిమాలకు లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాక్కూడా అలాంటి విజయమే దక్కుతుంది. కామెడీతోపాటు అన్ని ఎమోషన్స్ ఉన్న కథ ఇది. ఐశ్వర్యరాజేశ్తో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అని హీరో తిరువీర్ పేర్కొన్నారు. ఈ సినిమా అందర్నీ కొత్తగా ఎంటర్టైన్ చేస్తుందని దర్శకుడు భరత్ దర్శన్ తెలిపారు. ఇంకా నిర్మాత మహేశ్వర్రెడ్డి, నటులు జీవన్, గవిరెడ్డి, డీవోపీ కుషేందర్ కూడా మాట్లాడారు.