‘ఇందులో హీరోయిన్ గుండె వేగం సాధారణ స్థాయిని దాటితే ఆమె శరీరం నుంచి ఎలక్ట్రిక్ షాక్ జనరేట్ అవుతుంది. ఇలాంటి సమస్య ఉన్న అమ్మాయి జీవితంలోకి ప్రేమించిన అబ్బాయి వస్తే ఏం జరిగింది? ఆమె ప్రేమ సక్సెస్ అయ్యిందా? ఈ సమస్య వల్ల వారి జీవితం సజావుగా సాగిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే ‘ఓ..! సుకుమారి’. ఇది నిజంగా అరుదైన కథ’ అంటున్నారు హీరో తిరువీర్. ఆయన, ఐశ్వర్యరాజేశ్ జంటగా నటించిన రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకుడు. మహేశ్వర్రెడ్డి మూలి నిర్మాత.
ఈ నెల 17న సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో విలేకరులతో తిరువీర్ మాట్లాడారు. ‘మా దర్శకుడు భరత్ దర్శన్ది సిద్ధిపేట. ఈ మధ్య కాలం చాలామంది దర్శకులు తమ ప్రాంతాల కథలను, పాత్రలను చెప్పడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
ఇది తెలంగాణ నేపథ్యంలో సాగే పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎంత నవ్విస్తుందో, అంత భావోద్వేగానికి గురిచేస్తుంది. ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు భరత్ దర్శన్. భవిష్యత్లో కమర్షియల్ డైరెక్టర్గా ఎదుగుతారాయన’ అని తెలిపారు తిరువీర్. ‘బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండానే సినిమా చూసి కనెక్టయ్యామంటే అది మంచి సినిమా అని అర్థం. ‘ఓ..! సుకుమారి’ని అలాగే చూసి కనెక్టయ్యాను. ఆడియన్స్ కూడా అలాగే కనెక్ట్ అవుతారని నా నమ్మకం. చాలా ఇళ్లల్లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మసూద, ప్రీ వెడ్డింగ్ లాంటి సినిమాలు పెట్టమని అడుగుతుంటారు. ‘ఓ..! సుకుమారి’ కూడా అలా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అని నమ్మకంగా చెప్పారు తిరువీర్.