Tollywood | ప్రతీ ఏడాదిలాగే 2023 కూడా కొంతమంది యాక్టర్లకు చాలా ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు.కానీ కొందరు స్టార్ హీరోలకు మాత్రం మరిచిపోలేని ఏడాదిగా నిలిచిపోనుంది. ఈ స్టార్ హీరోలంతా లీడింగ్లో ఉన్న వారే కావడం గమనార్హం. ఇంతకీ విషయమేంటంటే 2023లో మంచి బ్రేక్ అందుకున్న స్టార్ హీరోల మాట అటుంచితే.. ఈ ఏడాది అసలు ఒక్క సినిమా కూడా థియేటర్లకు తీసుకురాని స్టార్ హీరోల గురించే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ హీరోలెవరనేది ఊహించే ఉంటారు..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), గ్లోబల్ స్టార్ హీరోలు రాంచరణ్ (Ramcharan) సూపర్ స్టార్ మహేశ్ బాబు.
ప్రతీ ఏడాది ఒక్క సినిమా అయినా ఉండేలా ప్లాన్ చేసుకునే ఈ బడా హీరోలు ఎందుకో ఈ ఏడాది మాత్రం అభిమానులను నిరాశపర్చడం మూవీ లవర్స్కు కొంత జీర్ణించుకోలేని విషయమే అని చెప్పాలి. అయితే ఈ స్టార్ హీరోలు 2024లో అభిమానులకు కావాల్సిన ఫుల్ మీల్స్ అందించేందుకు ఇప్పటినుంచే రెడీ అవుతున్నారు. 2024లో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నారు. ముందుగా ప్రిన్స్ మహేశ్ బాబు (Maheshbabu) త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో నటిస్తున్న గుంటూరు కారం సినిమాతో బాక్సాఫీస్ బ్యాంగ్ షురూ చేయబోతున్నాడు. ఈ మూవీ జనవరి 13న విడుదల కానుంది.
ఆ తర్వాత నేను కూడా బాక్సాఫీస్పై దండయాత్ర చేయడానికొస్తున్నాంటూ దేవర రిలీజ్ అప్డేట్తో చెబుతున్నాడు తారక్. దేవర చిత్రం ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్న పుష్ప.. ది రూల్ ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ప్రస్తుతం రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న గేమ్ ఛేంజర్. షూటింగ్ దశలో ఉన్న పాన్ ఇండియా ప్రాజెక్టు 2024లోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి హీరోల మాటెలా ఉన్నా సదరు స్టార్ హీరోల అభిమానులకు మాత్రం తీరని లోటు మిగిల్చిందనే చెప్పాలి. కనీసం వచ్చే ఏడాది అయినా తమ సినిమాలతో ఆ లోటును భర్తీ చేస్తారేమో చూడాలంటున్నారు మూవీ లవర్స్.