దాదాపు మూడు నెలల విరామం తర్వాత థియేటర్లలో బొమ్మ పడబోతున్నది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్స్ పునఃప్రారంభంకాబోతున్నాయి. కరోనా సెకండ్వేవ్ ఉధృతితో ఏప్రిల్ నెలలో థియేటర్లు మూతపడ్డాయి. ఇటీవలే లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ ప్రభుత్వం సినిమాల ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు థియేటర్లను తెరవడానికి ముందుకు రాలేదు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ శనివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. కరోనా సెకండ్వేవ్ మూలంగా థియేటర్లు మూతపడటంతో అందులో పనిచేసే లక్షలాది మంది కార్మికులు జీవనోపాధిని కోల్పోయారు. వారు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 23 నుంచి థియేటర్లను తెరవాలని ఎగ్జిబిటర్స్ నిర్ణయించారు. ఆ సమయంలోగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను థియేటర్లలో ప్రదర్శించాలని నిశ్చయించారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందనే నమ్మకంతో ఉన్నామని ఎగ్జిబిటర్స్ పేర్కొన్నారు.
సమస్యల్ని పరిష్కరించాలి..
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా నష్టపోయిన థియేటర్ల వ్యవస్థను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరింది. శనివారం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను కలిసిన ఛాంబర్ ప్రతినిధులు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించి థియేటర్లను కాపాడాలని మంత్రికి విన్నవించారు. సినీ ఎగ్జిబిటర్స్ ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఛాంబర్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఫ్రీపార్కింగ్ మూలంగా థియేటర్ల నిర్వహణ భారం పెరిగింది. పార్కింగ్ ఫీజు తిరిగి వసూలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఛాంబర్ ప్రతినిధులు కోరారు. అలాగే లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూసివేసిన కాలానికి కరెంటు బిల్లులను రద్దుచేయాలని తెలిపారు. మున్సిపల్, ప్రాపర్టీ టాక్స్ను రెండేళ్ల కాలానికి మినహాయింపు ఇవ్వడమే కాకుండా స్టేట్ జీఎస్స్టీని మాఫీ చేసి థియేటర్లను కాపాడాలని తెలంగాణ ఛాంబర్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్, సెక్రటరీ సునీల్నారంగ్, తదితరులు పాల్గొన్నారు.