రామ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ది వారియర్’. ఈ చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో ఆయన నటిస్తున్నారు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్నది. ఆది పినిశెట్టి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతున్నది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా అనంతపురంలో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి శ్రీను ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…‘ట్రైలర్ బాగుంది. ఈ సినిమా రామ్కు మంచి విజయాన్ని అందిస్తుందని కోరుకుంటున్నా. మీ అభిమానం పొందాలనే ఈ సినిమా టీమ్ ఇంత దూరం వచ్చింది. ఇక్కడ వేడుక నిర్వహించిందంటే సగం విజయాన్ని ఈ సినిమా అందుకున్నట్లే’ అని అన్నారు.
హీరో రామ్ మాట్లాడుతూ…‘ప్రేక్షకుల ఆదరణ, అభిమానమే మాకు ఉత్సాహాన్ని ఇస్తుంటుంది. ఈ సినిమాలో ప్రతి ఎమోషన్ను నిజంగా అనుభూతి చెంది నటించాం. దర్శకుడిగా లింగుస్వామి చాలా మందికి స్ఫూర్తినిస్తుంటారు. ఆయన తరహా మేకింగ్ ప్రభావం తెలుగు సినిమాల మీదా ఉంది. అనంతపురం ప్రజల అభిమానం మర్చిపోలేను’ అన్నారు. ‘తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో కుదరడం ఆనందంగా ఉంది. రామ్ ఎనర్జీని ఈ సినిమాలో పూర్తిగా చూస్తారు. ‘ది వారియర్ 2’ చిత్రాన్నీ రూపొందించాలనే ఆలోచన ఉంది’ అని దర్శకుడు లింగుస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక కృతి శెట్టి, నటుడు ఆది పినిశెట్టి, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.