Esha Rebba | ఇతర భాషల వాళ్లు తెలుగు పరిశ్రమ గురించి మాట్లాడుతుంటే చాలా గర్వంగా ఉంటుందని, అయితే టాలీవుడ్లో మాత్రం తెలుగమ్మాయిల కంటే పరాయి వాళ్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది కథానాయిక ఈషా రెబ్బా. ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ అచ్చ తెలుగు అందం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమా అవకాశాల గురించి మాట్లాడింది. ‘నేను ఇతర భాషా చిత్రాల్లో నటించినప్పుడు అక్కడి వాళ్లంతా తెలుగు సినిమాల గురించి గొప్పగా మాట్లాడుకోవడం గర్వంగా అనిపించేది. అయితే మన దగ్గర మాత్రం పరభాషా నాయికలనే ఎక్కువగా తీసుకుంటారు. ఇతర భాషల కథానాయికలు మాత్రమే కావాలని ప్రేక్షకులు డిమాండ్ చేయరు కదా? అలాంటప్పుడు వారికి అవకాశాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాదు’ అని ఈషా రెబ్బ పేర్కొంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ‘మాయా మశ్చీంద్ర’ ‘దయా’ చిత్రాల్లో నటిస్తున్నది.