‘బలగం’ చిత్రం థియేటర్, ఓటీటీని దాటి తెలంగాణ పల్లె గడప తట్టింది. ఊరి బొడ్రాయి కాడ కుటుంబ అనుబంధాలకు పరదా కట్టింది. చావు కథలో బతుకు తీపిని చూపిస్తూ రక్త సంబంధాల బలగమెంత బలమో కండ్లకు కడుతున్నది. ఇప్పుడు తెలంగాణ గ్రామాల్లో ‘బలగం’సినిమా బహిరంగ ప్రదర్శనలు ఓ మహోత్సవంలా మారాయి. సాయంత్రం వేళల్లో గ్రామ కూడళ్లు జాతరను తలపిస్తున్నాయి. నిజంగానే ఇదొక సాంస్కృతిక విప్లవం. తెలంగాణ మట్టికథకు గ్రామసీమల్లో జరుగుతున్న పట్టాభిషేకం. చిన్న పట్టణాలు, గ్రామాల్లో పరదాలు కట్టి ప్రొజెక్టర్ల ద్వారా సినిమాలు ప్రదర్శించే ట్రెండ్ దశాబ్దాల కిందట కనిపించేది. అదే దృశ్యం ‘బలగం’ చిత్రం ద్వారా తెలంగాణ పల్లెల్లో మళ్లీ ఆవిష్కృతమవుతున్నది.
ఓ సినిమా ఓటీటీలోకి వచ్చిందంటే థియేటర్కు వెళ్లేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు. కానీ ‘బలగం’ సినిమా ఈ ట్రెండ్ను తిరగరాసింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే.. థియేటర్స్లో కూడా అపార ఆదరణ సొంతం చేసుకుంటున్నది. ఇప్పుడు ఈ సినిమా ప్రదర్శనకు గ్రామాలు వేదికలు అవుతున్నాయి. ప్రొజెక్టర్ల ద్వారా ఊరి కూడళ్లలో, పాఠశాలల్లో తెరలు కట్టి ‘బలగం’ సినిమాను ప్రదర్శిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సినిమా స్వర్ణ యుగపు రోజులు పునరావృతమయ్యాయని సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో ఈ సినిమా చూసి అనుబంధాలు తలుచుకొని మహిళలు, వృద్ధులు కండ్లు ఒత్తుకుంటూ కనిపిస్తున్నారు. చెదిరిపోయిన తమ బలగాన్ని గుర్తుచేసుకొని గుండె బరువుతో ఇండ్లకు వెళ్తున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ‘బలగం’ వార్తల్లో నిలుస్తున్నది.
సినిమాల్ని ప్రొజెక్టర్ల ద్వారా ఊరి కూడళ్లలో బహిరంగంగా ప్రదర్శించడం ముప్ఫై ఏళ్ల కిందటి ముచ్చట. బ్లాక్ అండ్ వైట్ జమానాలో ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన పౌరాణిక, కుటుంబ కథా చిత్రాలను పండుగలు, ఉత్సవాల సమయాల్లో గుడి ప్రాంగణాల్లో ఇలా తెర కట్టి ప్రదర్శించేవారు. తెలంగాణ ప్రాంతంలో ‘మా భూమి’ చిత్రం కూడా అలాంటి ఘనతను సొంతం చేసుకుంది. తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ‘మా భూమి’ నాటి సమాజాన్ని కదిలించింది. గ్రామీణ ప్రజలు ఈ సినిమా చూడటానికి బండ్లు కట్టుకొని సమీప పట్టణాలకు వెళ్లేవారు. గ్రామాల్లో కూడా తెరలు కట్టి ఈ సినిమాను ప్రదర్శించారని చెబుతారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ‘బలగం’ సినిమాతో తెలంగాణ పల్లెల్లో మళ్లీ ఆనాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ రోజుల్లో సినిమా చూడాలంటే థియేటర్కు వెళ్లడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. దీంతో ప్రజలు టూరింగ్ టాకీస్లకు, ఇలా బహిరంగ ప్రదర్శన స్థలాలకు తరలివెళ్లేవారు. కానీ, నేటి సాంకేతిక యుగంలో సినిమా చూడటానికి థియేటర్, టీవీ, ఓటీటీ ఇలా రకరకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. ఇన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ ‘బలగం’ సినిమాను గ్రామాల్లో దండోరా వేసి మరీ ప్రదర్శించడం సరికొత్త సినీ సాంస్కృతిక విప్లవంగా అభివర్ణిస్తున్నారు.
‘బలగం’ సినిమా ఈ స్థాయిలో గ్రామీణుల్లో సామూహిక ఉద్వేగాల్ని పోగు చేయడం వెనకున్న కారణాలను విశ్లేషిస్తే.. చావు నేపథ్యంలో కూడా అనుబంధాల గొప్పతనాన్ని చూపించడమే! చిన్నకథలో విస్తారమైన జీవన తాత్వికతను చెప్పడం గ్రామీణులను ఆకట్టుకుంటున్నది. కుటుంబ విలువలను తెలియజేస్తూనే తెలంగాణ సంస్కృతి మూలాలు, ఆచార వ్యవహారాల్ని ఎలాంటి కృత్రిమత్వం లేకుండా సహజంగా తెరపైకి తీసుకొచ్చిన తీరు ప్రతి ఒక్కరినీ మెప్పిస్తున్నది. పంతాలు, పట్టింపులతో అయినవాళ్లను దూరం చేసుకున్న కుటుంబాలు ప్రతి గ్రామంలో ఉంటాయి. చిన్నచిన్న విషయాలకే పేచీ పెట్టుకొని ఏండ్లుగా దూరంగా ఉంటున్న కుటుంబాలు కూడా కనిపిస్తాయి. ‘బలగం’ కథలోని ఈ అంశాలకు ప్రజలు బాగా కనెక్ట్ అవుతున్నారు. తమ కుటుంబాల్ని తెరపై చూసుకున్నామన్న భావనకు లోనవుతున్నారు. అనుబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం తెలంగాణ డీఎన్ఏలోనే ఉంటుంది. ఆడపిల్లకు పుట్టింటి మీద తీరని మమకారం ఉండటం సహజం. తోబుట్టువులు దూరమైతే తట్టుకోలేరు. ఈ సినిమాలో ఇరవై ఏండ్లపాటు పుట్టింటికి దూరమైన లక్ష్మి పాత్ర చుట్టూ అల్లుకున్న సీన్లు, పతాక సన్నివేశాల్లో వచ్చే పాట గ్రామీణుల మనసులు కదిలిస్తున్నది. ఏ సెట్టింగులూ లేకుండా తెలంగాణ పల్లె సౌందర్యాన్ని సహజంగా చూపించడం కూడా ‘బలగం’ సినిమా ప్రధాన బలాల్లో ఒకటిగా నిలిచింది.
మౌఖిక సాహిత్యం, జానపద కళారూపాలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుంది. వ్యావహారిక భాషలోని పాటలకు ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారు. ‘బలగం’ చిత్రంలో బుడగ జంగాల కళాకారులు మొగిలయ్య, కొమురమ్మ దంపతులు పాడిన ైక్లెమాక్స్ గీతం ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నది. ‘తోడుగా మాతోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కడికెళ్లినావు కొమురయ్యా’ అంటూ సరళమైన భాషలో బలమైన భావోద్వేగాల్ని పలికించిన ఈ పాట అందరి హృదయాలనూ తాకుతున్నది. జీవితంలో ఎప్పుడూ రక్త బంధాలను తెంచుకోవద్దని, కలిసి ఉంటే కలదు సుఖమని తెలియజెప్పిన ఈ గీతం చిత్రానికి మకుటాయమానం. ఈ పాట వచ్చిన సందర్భంలోనే ఉద్వేగాల్ని ఆపుకోలేక ప్రేక్షకులు కంటతడి పెడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో ‘శంకరాభరణం’ స్ఫూర్తితో సంగీత పాఠశాలలు వెలిశాయి. ఒక్కసారిగా సంగీతం పట్ల మక్కువ పెరిగింది. ఇప్పుడు ‘బలగం’ సినిమాతో విడిపోయిన కుటుంబాలు కలిసిపోతున్నాయి. మనస్పర్ధలతో దూరమైన అన్నదమ్ములు ఒక్కటవుతున్నారు. పంతాలు, పట్టింపులతో దూరమైన బంధువులు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ‘బలగం’ సినిమా తమ కుటుంబాలను కలిపిందనే వార్తలు దినపత్రికల్లో ప్రతిరోజూ దర్శనమిస్తున్నాయి. సినిమా ద్వారా సామాజిక ప్రయోజనం నెరవేరిన సందర్భాలు అరుదు. కుటుం బాలన్నీ ఉమ్మడిగా సినిమాను చూస్తూ పాత పంచాయితీలకు తిలోదకాలిచ్చి కొత్త అనుబంధాలకు ఊపిరులు ఊదుతున్నాయి. ‘బలగం’ తెలంగాణ ప్రజల హృదయాల్లోకి బలంగా వెళ్లిందని, తెలంగాణ కథకు నూతన జవసత్వాలు అందించిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
గ్రామాల్లో సినిమాను ప్రదర్శించడం అద్భుతంగా అనిపిస్తున్నది. నా చిన్నతనంలో వినాయక చవితి పండగ రోజుల్లో మండపాల్లో పరదా కట్టి సినిమా చూపించేవాళ్లు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అలాంటి దృశ్యాలు పల్లెల్లో కనిపిస్తున్నాయి. నా దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇంతలా ప్రజల మనసుల్ని గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది.
– వేణు ఎల్దండి, దర్శకుడు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, మట్టి పరిమళాలకు దర్పణంగా ‘బలగం’ సినిమాను అభివర్ణిస్తుంటే.. మరోవైపు తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ‘దసరా’ సినిమాపై విమర్శలు వస్తున్నాయి. విపరీతమైన హింస, మద్యపానం దృశ్యాలతో తెలంగాణ సంస్కృతిని వక్రీకరించారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సింగరేణి వాతావరణాన్ని వాస్తవికతకు దూరంగా, అభూత కల్పనలతో తెరకెక్కించి ఆ ప్రాంత గౌరవానికి భంగం కలిగించారని భావిస్తున్నారు. ముఖ్యంగా అక్కడి కార్మికులకు మందు లేనిదే జీవితం లేదన్నట్లుగా చూపించడం ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని పలువురు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో పండుగలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మద్యం తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని.. దీనిని సాకుగా చూపుతూ ఇక్కడి ప్రజలను వ్యసనపరులుగా చూపించడం మంచిదికాదని ఆక్షేపిస్తున్నారు. అయితే మరో కోణంలో ‘దసరా’ సింగరేణి నేపథ్యంలో తీసిన ఫక్తు కమర్షియల్ చిత్రమని.. అందులో సంస్కృతిపరమైన చర్చ అనవసరమనే వాదన కూడా వినిపిస్తున్నది. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడి మేకింగ్ ైస్టెల్ ప్రశంసలు అందుకుంటున్నది. రా అండ్ రస్టిక్ కథను తెరపై తీసుకొచ్చిన విధానం బాగుందని కొందరి అభిప్రాయం.
‘బలగం’ సినిమా ఏ మాధ్యమంలోనైనా సరే ప్రేక్షకులకు చేరువ కావాలన్నది మా అభిమతం. సినిమా చూడాలంటే థియేటర్, ఓటీటీ, టీవీ వంటి మూడు ఆప్షన్స్ ఉంటాయి. ‘బలగం’ సినిమాను తెరలు కట్టి చూపిస్తున్నారు. ఇంతటి ఆదరణ వస్తుందని అస్సలు ఊహించలేదు. ఈ సినిమా చూస్తూ కుటుంబాలు కలిసిపోతున్నాయంటే మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. మా సినిమా ద్వారా సమాజంలో మార్పు వస్తున్నదంటే అంతకుమించిన సంతోషం ఏముంటుంది? ఈ సినిమాను ఎవరైనా ఓపెన్గా చూడొచ్చు. ఎక్కడైనా అందుబాటులో లేకుంటే మమ్మల్ని సంప్రదిస్తే షోలు ఏర్పాటు చేస్తాం.
– దిల్ రాజు, నిర్మాత
…? కళాధర్ రావు జూలపల్లి