’హనుమాన్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది . తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది . ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడిన అ యన సంక్రాంతి సినిమాల విడుదలపై కీలక వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి మాట్లాడుతూ ’సంక్రాంతి సినిమాలకు పరీక్షాకాలం.. హను-మాన్ చిత్రానికి థియేటర్లు దొరకడం లేదని నిర్మాతలు బాధపడ్డారు. థియేటర్ల విషయంలో నిర్మాతలు బాధపడాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు. మొదటి రోజు కాకపోతే రెండో రోజు, కుదరకపోతే మూడో రోజు చూస్తారు.
దిల్ రాజు సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి.. ఆయనకు ఈ సీజన్ లో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు ఇవ్వాలో తెలుసు. ఖైదీ నెం.150 సమయంలో ’శతమానంభవతి ’ విడుదల చేశారు. శతమానంభవతి రిలీజ్ కొంచెం ఆలస్యం చేయవచ్చు కదా అని దిల్ రాజును అడిగాను. రెండు పెద్ద సినిమాల మధ్య మా సినిమా కూడా ప్రేక్షకులు చూస్తారని దిల్ రాజు చెప్పాడు. దిల్ రాజు చెప్పినట్లే శతమానంభవతి బాగా ఆడింది. ఇప్పుడు హను-మాన్ కూడా బాగా ఆడుతుంది. సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలు ఆడాలి, పరిశ్రమ పచ్చగా ఉండాలి’ అన్నారు . రామ మందిర నిర్మాణం చారిత్రక ఘట్టమని, రామాలయ ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని , కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఉత్సవానికి హాజరు కాబోతున్నానని చిరంజీవి తెలిపారు. హనుమాన్ సినిమా టికెట్స్ పై ప్రతి ఐదు రూపాయలను రామ మందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర బృందం పేర్కొంది.