OTT | పోచర్
అమెజాన్ ప్రైమ్: ఫిబ్రవరి 23
తారాగణం: నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య తదితరులు
దర్శకత్వం: రిచీ మెహతా
సృష్టిలోని జీవులన్నీ పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంటాయి. కానీ, మనిషి మాత్రం ప్రకృతి విధ్వంసానికి తన తెలివి తేటలను ఉపయోగిస్తున్నాడు. తన మనుగడ కోసం అడవిని, అందులోని జంతుజాలాన్ని నాశనం చేస్తున్నాడు. ఆ వినాశకుల విపరీత చర్యలు ఎలా ఉంటాయో కండ్లకు కట్టినట్టు చూపించిన వెబ్సిరీస్ ‘పోచర్’. 2015లో కేరళ అటవీశాఖ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ శిఖర్’ ఆధారంగా ఈ సిరీస్ను ఓటీటీకెక్కించాడు దర్శకుడు రిచీ మెహతా. కథలోకి వెళ్తే.. దక్షిణ కేరళలో దట్టమైన అడవిలో దంతాల స్మగ్లింగ్ కోసం ఏనుగులను గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెడుతుంటారు కొందరు దుండగులు. కఠినమైన చట్టాలు చేసిన తర్వాత ఏనుగుల వేటకు అడ్డుకట్టపడిందని భావిస్తున్న అటవీశాఖ అధికారుల్లో తాజా దాడులు కలకలం రేపుతాయి.
ఏనుగులను అంతమొందిస్తున్న స్మగ్లర్లకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ కిందిస్థాయి అధికారి కూడా సాయం చేస్తుంటాడు. జరుగుతున్న దారుణాలు చూడలేక.. అప్రూవర్గా మారతాడు. స్మగ్లర్ రాజ్ (నూరుద్దీన్) ఆధ్వర్యంలోనే ఏనుగుల వేట కొనసాగుతుందని ఆ అధికారి పై అధికారులకు చెబుతాడు. దీంతో డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అవుతుంది. స్మగ్లర్లను పట్టుకోవడానికి రేంజ్ ఆఫీసర్ మాలా జోగి (నిమిషా సజయన్) నేతృత్వంలో ఒక బృందం రంగంలోకి దిగుతుంది. అలాన్ (రోషన్ మాథ్యూ)తోపాటు మరికొందరితో కలిసి రాజ్ను పట్టుకోవడానికి అడవి అంతా గాలిస్తుంటుంది. ఈ ఆపరేషన్లో మాల ఏనుగుల వేటగాళ్లను పట్టుకుందా? ఈ క్రమంలో వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరికి ఏం జరిగింది? అన్నది మిగిలిన కథ. ఎనిమిది ఎపిసోడ్లుగా నిర్మించిన ఈ సిరీస్ అక్కడక్కడా నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. చివరి ఎపిసోడ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.