దర్శకుడి మస్తిష్కం నుంచే సినిమాకు అంకురార్పణ జరుగుతుంది. సినిమా కళకు సృజనాత్మక సారథిగా నిర్దేశకుడిని అభివర్ణిస్తారు. అందుకే మెగాఫోన్ పట్టాలని చాలా మంది కలలు కంటుంటారు. ఇందుకు సినీ తారలు మినహాయింపేం కాదు. కెమెరా ముందు అభినయంతో మెప్పించే నటీనటులు తమలోని సృజనాత్మక కౌశలాల్ని ప్రదర్శించడానికి దర్శకత్వాన్ని ఓ వేదికగా ఎంచుకుంటున్నారు. తమ అభిరుచుల్ని ప్రతిబింబించే కథల్ని వెండితెర దృశ్యమానం చేయడానికి వారే స్వయంగా దర్శకత్వానికి సిద్ధమవుతున్నారు. ఓవైపు నటన, మరోవైపు దర్శకత్వంతో వృత్తిపరమైన సృజనాత్మక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సత్తాచాటుతున్నారు.
నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో విలక్షణ అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు మోహన్లాల్. సుదీర్ఘ సినీ ప్రయాణంలో నటుడిగానే కొనసాగుతూ వచ్చిన ఆయన తొలిసారి మెగాఫోన్ పట్టారు. ‘బరోజ్ గార్డియన్ ఆఫ్ ది డీగామా ట్రెజర్’ పేరుతో ఓ సినిమాను రూపొందించబోతున్నారు. త్రీడీ ఫాంటసీ అడ్వెంచరస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు టైటిల్ పాత్రలో మోహన్లాల్ నటిస్తుండటం విశేషం. వాస్కోడిగామాకు చెందిన కోట్లాది రూపాయల విలువైన నిధికి సంరక్షకుడిగా వ్యవహరిస్తూ నిజమైన వారసులకు ఆ సంపదను అందించే యోధుడి పాత్రలో ఈ సినిమాలో మోహన్లాల్ కనిపించబోతున్నారు.
తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో తనదైన విలనిజంతో ప్రేక్షకుల్ని భయపెట్టింది వరలక్ష్మి శరత్కుమార్. ప్రతినాయికగా, సహాయనటిగా చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్న ఆమె తాజాగా దర్శకురాలిగా అరంగేట్రం చేయబోతున్నది. ‘కన్నామూచి’ పేరుతో తమిళంలో థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఇటీవల ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందనున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్ కథానాయికగా నటించబోతున్నది.
ప్రేమకథా చిత్రాలతో లవర్బాయ్గా దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు మాధవన్. గత కొంతకాలంగా ప్రయోగాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తోన్న ఆయన ‘రాకెట్రీ’ సినిమాతో దర్శకుడిగా తొలి అడుగు వేయబోతున్నారు. భారత అంతరిక్ష పరిశోధనలో కీలకంగా వ్యవహరించిన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అసత్యపు ఆరోపణలతో దేశద్రోహం కేసును ఎదుర్కొన్న నంబి నారాయణన్ యాభై రోజులు జైలు జీవితాన్ని అనుభవించారు. ఆయన జీవితంలోని సంఘర్షణను ఆవిష్కరిస్తూ మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కథానాయకుడిగా నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి విభిన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నిఖిల్ తాజాగా దర్శకుడిగా సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. ప్రయోగాత్మక కథాంశంతో పరిమిత బడ్జెట్లో ఓ బాలల సినిమాను రూపొందించబోతున్నట్లు ఇటీవలే ఆయన ప్రకటించారు. ఈ సినిమా కోసం తానే స్వయంగా కథను సిద్ధంచేశారు నిఖిల్.
ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘మణికర్ణిక’కు క్రిష్తో కలిసి దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టింది కంగనా రనౌత్. తొలి సినిమాతోనే దర్శకురాలిగా ప్రతిభను చాటుకొన్న ఆమె ప్రస్తుతం ‘మణికర్ణిక’కు సీక్వెల్ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉంది. ఈ సీక్వెల్ ద్వారా పూర్తిస్థాయిలో దర్శకురాలిగా పరిచయం కాబోతున్నది కంగనా రనౌత్. కథానాయికగానే కాకుండా గాయకురాలిగా, రచయితగా..బహుముఖప్రజ్ఞాశీలిగా పేరుతెచ్చుకున్నది నిత్యామీనన్. ఈ ఏడాది ఆమె దర్శకురాలిగా మారబోతున్నట్లు సమాచారం. మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది.