అగ్ర కథానాయిక త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి ఆయనపై కేసును నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.
మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు మహిళలపై హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ఇలాంటి అసభ్యకరమైన మాటల్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఈ విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం.
ఐపీసీ సెక్షన్ 509బీ తో పాటు సంబంధిత సెక్షన్ల కింద మన్సూర్ అలీఖాన్పై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీని ఆదేశించాం’ అని మహిళా కమిషన్ ట్విట్టర్లో పేర్కొంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీఖాన్ ‘లియో’ చిత్రంలో త్రిషతో ఓ సన్నివేశం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో నేను చాలా రేప్ సీన్లలో నటించా.
‘లియో’ చిత్రంలో ఆఫర్ వచ్చినప్పుడు త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నా. అలాంటి సీన్ లేకపోవడం బాధగా అనిపించింది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై దక్షిణాది పరిశ్రమ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు సినీ ప్రముఖులు త్రిషకు మద్దతుగా నిలుస్తున్నారు.