ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ రూపొందించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారతీయ పురాణేతిహాసం రామయాణాన్ని వక్రీకరించారని, హనుమాన్ పాత్రధారి చెప్పిన సంభాషణలు ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంభాషణల్లో మార్పులు చేస్తామని చిత్ర రచయిత మనోజ్ ముంతాషిర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా విషయంలో తనకు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ప్రాణహాని ఉన్నందున తగిన రక్షణ కల్పించాలని రచయిత మనోజ్ ముంతాషిర్ ముంబయి పోలీసులను ఆశ్రయించారు. త్వరలో డైలాగ్స్ను మార్చబోతున్నామని చెప్పినా వివాదం సద్దుమణిగేలా కనిపించడం లేదని రచయిత మనోజ్ ముంతాషిర్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది. ఈ వివాదం ముగిసేవరకు రచయిత మనోజ్ ముంతాషిర్కు రక్షణ కల్పిస్తామని ముంబయి పోలీసులు హామీ ఇచ్చారని సమాచారం.