‘ఆత్మన్యూనత భావం కలిగిన రవీంద్ర అనే యువకుడి కథ ఇది. నల్లమల అరణ్యంలో అతడు నేర్చుకున్న జీవితపాఠాలేమిటన్నది ఆసక్తిని కలిగిస్తుంది’ అని అన్నారు క్రిష్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్రెడ్డి నిర్మించారు. ఈ నెల 8న విడుదలకానుంది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుక శనివారం ఏపీలోని కర్నూల్లో జరిగింది. ఈ సందర్భంగా వైష్ణవ్తేజ్ మాట్లాడుతూ ‘జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన తలెత్తుకొని తిరగాలని చెప్పే స్ఫూర్తిదాయకమైన కథ ఇది. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అని తెలిపారు. క్రిష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా విషయంలో మొదట పవన్కల్యాణ్కు కృతజ్ఞతలు చెప్పాలి. ‘హరిహరవీరమల్లు’ షూటింగ్ విరామంలో ఈ చిన్న సినిమాను చేస్తానని అడగ్గానే ఆయన అంగీకరించారు. ఆయన అనుమతించకపోయినా, సుకుమార్.. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ నవలను నాకు పరిచయం చేయకపోయినా..సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల రాయకపోయినా సినిమా తెరకెక్కేది కాదు. కీరవాణి తన సంగీతంతో సినిమాను మరో మెట్టుకి తీసుకెళ్లారు’ అని పేర్కొన్నారు. రాయలసీమ ఫ్యాక్షనిజం కథలకు భిన్నంగా అట్టడుగు వర్గాల వారి బాధలు, కష్టాల గురించి చాటిచెప్పే చిత్రమిదని సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకు మధ్య చాలా కాలం క్రితమే విడిపోయిన బంధాన్ని మళ్లీ కలిపిన చిత్రమిదని సాయిచంద్ చెప్పారు.