‘మజిలీ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాఖండ్ భామ దివ్యాంశ కౌశిక్. ఆమె రవితేజ సరసన నటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నెల 29న సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్ర విశేషాలను, తన కెరీర్ సంగతులు తెలిపింది నాయిక దివ్యాంశ కౌశిక్.
ఈ చిత్రంలో నందినీ అనే పాత్రలో కనిపిస్తా. ఒక ఇల్లాలిగా, తల్లిగా కథలో కీలకంగా సాగే పాత్ర నాది. పరిణితి గల మహిళగా నటించాను. నటిగా నాకు ఈ పాత్ర కొత్త అనుభవం. 1995 సంవత్సరంలో జరిగే బలమైన కథా నేపథ్యంతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. నేను రవితేజ కలిసి మరో నాయిక రజిషా విజయన్తో ఒక కీలక సన్నివేశంలో నటించాం.
నటిగా వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని కోరుకునే నాకు నందినీ లాంటి పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. భార్యగా హీరోకు అండగా నిలబడే క్యారెక్టర్ చేశాను. హీరోయిన్గా సరదాగా, అల్లరిగా ఉండే పాత్రల్లో నటించడం సులువే. కానీ పరిణితి చెందిన క్యారెక్టర్స్ చేసినప్పుడే నటిగా గుర్తింపు దక్కుతుంది. నాకూ నటించిన సంతృప్తి ఉంటుంది. ఈ పాత్రలో నటనకు ఆస్కారం ఎక్కువ. షూటింగ్ సమయాన్ని ఆస్వాదించాను.
తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది కానీ డబ్బింగ్ చెప్పుకోలేదు. తెలుగు నేర్చుకుంటున్నా. తర్వాతి చిత్రానికి ప్రయత్నిస్తా. దర్శకుడు సుధీర్ వర్మతో ఓ సినిమా చేస్తున్నా, అలాగే ‘మైఖేల్’ అనే సినిమాలో నటిస్తున్నా.