దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కింగ్ జాకీ క్వీన్’ చిత్రం మంగళవారం ప్రారంభమైంది. కె.కె.దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్లాప్నిచ్చారు. ‘1990ల నాటి కథాంశమిది. పీరియాడిక్ క్రైమ్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. ‘దసరా’ చిత్రంతో దీక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ సినిమాలో ఆయన పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. 90ల నాటి వాతావరణాన్ని ప్రేక్షకుల కళ్లముందుంచుతూ కొత్త అనుభూతిని అందిస్తుంది’ అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: నగేష్ బానెల్, సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీకాంత్ రామిశెట్టి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శేఖర్ యలమంచలి, దర్శకత్వం: కెకె.