గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ‘కాంతార’ చిత్రాన్ని వివాదాలు మాత్రం వీడటం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో విశేష ప్రాచుర్యం పొందిన ‘వరాహ రూపం’ పాట కాపీరైట్ నిబంధనల్ని ఉల్లఘించిందని కేరళకు చెందిన థాయికూడం బ్రిడ్జ్ మ్యూజిక్ బ్యాండ్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. తాము రూపొందించిన ‘నవరస’ అనే పాట ట్యూన్ను కాపీకొట్టి ‘వరాహ రూపం’ కోసం వాడుకున్నారని తాయికూడం బ్యాండ్ ఆరోపిస్తున్నది.
తాజాగా ఈ వివాదంపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు ఈ పాటను థియేటర్స్తో పాటు డిజిటల్ మాధ్యమాల్లో కూడా ఉపయోగించవొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘వరాహ రూపం’ పాట విషయంలో చిత్ర సంగీత దర్శకుడు కాపీరైట్ చట్టాన్ని ఉల్లఘించారని కోర్టు పేర్కొంది. ‘కాంతార’ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ సైతం తాను ‘నవరస’ పాటతో స్ఫూర్తితోనే ‘వరాహ రూపం’ పాటను కంపోజ్ చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదే విషయాన్ని విచారణ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. రిషబ్శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రం 400కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.