సమంత ప్రధాన పాత్రలో నటించిన ఇతిహాసిక నేపథ్య సినిమా ‘శాకుంతలం’ కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేస్తామని శుక్రవారం వెల్లడించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది.
మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇతర పాత్రలను మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, మధుబాల, గౌతమి తదితరులు పోషించారు.