విక్రమ్ హీరోగా దర్శకుడు గౌతమ్మీనన్ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కించిన ‘ధృవనక్షత్రం’ సినిమా ఎట్టకేలకు అవాంతరాలను దాటుకొని విడుదలకు సిద్ధమైంది. 2016లో మొదలుపెట్టిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ ఆర్థికపరమైన సమస్యలతో కష్టాలను ఎదుర్కొంది. సినిమాను పూర్తిగా పక్కనపెట్టారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ సినిమా ట్రైలర్, ప్రచార చిత్రాలకు అప్పుట్లో మంచి హైప్ లభించింది.
ఇటీవల ఈ ప్రాజెక్ట్కు దర్శకుడు గౌతమ్మీనన్ తుదిమెరుగులు దిద్దారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేస్తున్నట్లు గౌతమ్మీనన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రీతూవర్మ, సిమ్రాన్, రాధిక శరత్కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతాన్నందించారు. ఏడేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ధృవనక్షత్రం సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతుండటంతో విక్రమ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.