వేతనాల పెంపు విషయంలో తెలుగు సినీ కార్మిక సమాఖ్య, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మధ్య నెలకొన్న వివాదానికి పరిష్కారం లభించింది. గురువారం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్తో సినీ కార్మికుల సమాఖ్య, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు విడివిడిగా భేటీ అయ్యారు. ఇరు వర్గాలతో జరిపిన చర్చల్లో వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవడంతో, సమ్మె విరమించి షూటింగ్స్లో పాల్గొంటామని సినీ కార్మికులు హామీ ఇచ్చారు.
వేతనాల పెంపును నిర్ణయించడానికి అగ్ర నిర్మాత దిల్రాజు అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం చర్చలు జరిపి విధివిధానాలు నిర్ణయిస్తామని ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. సినీ కార్మికులు శుక్రవారం నుంచి షూటింగ్స్కు హాజరవుతారని, మంత్రి తలసాని చొరవతో అన్ని సమస్యలకు పరిష్కారం లభించిందని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని చెప్పారు.