‘కేజీఎఫ్’ సిరీస్లో వచ్చిన రెండు చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని సంపాదించుకున్నారు కన్నడ హీరో యష్. ఆయన తన తదుపరి చిత్రాన్ని మహిళా దర్శకురాలు గీతూ మోహన్దాస్తో చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా తాజా సమాచారం ప్రకారం సూపర్స్టార్ రజనీకాంత్ చిత్రంలో యష్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే… లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ తన 171వ చిత్రానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో ప్రతినాయక ఛాయలుండే అతిథి పాత్రలో యష్ నటించబోతున్నారని సమాచారం. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన‘విక్రమ్’ చిత్రంలో సూర్య మాఫియా డాన్ రోలెక్స్ పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే. అదే తరహాలో రజనీకాంత్ చిత్రంలో యష్ పాత్ర ఉంటుందని సమాచారం. లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం విజయ్తో ‘లియో’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనంతరం రజనీకాంత్ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు.