Keeda Cola | టాలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దాస్యం తెరకెక్కించిన ‘కీడా కోలా’ సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్పీ చరణ్ కీడా కోలా టీమ్కు లీగల్ నోటీసులు పంపాడు. తన తండ్రి (ఎస్పీ బాలసుబ్రమణ్యం) వాయిస్ను ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీ క్రియేట్ చేసి కీడా కోలా సినిమాలో వాడుకున్నందుకు ‘కీడా కోలా’ చిత్ర నిర్మాతతో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్లకు ఎస్పీ చరణ్ నోటీసులు పంపారు. అయితే ఈ కాంట్రవర్సీపై తరుణ్ భాస్కర్ తాజాగా స్పందించారు. కమ్యూనికేషన్ ఇష్యూ వల్లనే ఇదంతా జరిగిందని చెప్పారు.
మాకు, ఎస్పీ చరణ్ సార్కు మధ్య కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అది మా సైడ్ నుంచి.. చరణ్ సార్ సైడ్ నుంచి కూడా జరిగింది. ఎవరైనా సరే ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటారు. అంతే కాకుండా మన సినీ దిగ్గజాలను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. అంతకు మించి ఏం లేదు. ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశం ఏం ఉండదు. మీరు కూడా చూస్తున్నారు.. నేను చేసేది చిన్న సినిమాలు. పెద్ద స్టార్స్తో ఏదో కమర్షియల్ గా చెయ్యాలని నేను అనుకోను. నాకు కమర్షియల్ మెంటాలిటీ లేదు. మా వరకు ఏదైనా కొత్తగా చేయాలనే ప్రయత్నం చేశాం అని తరుణ్ భాస్కర్ తెలిపాడు.
We intended to honour a Legend like SPB Garu utilising AI. There was a communication gap between us & SP Charan Sir & it is resolved.
says #TharunBhascker about the notices that SP Charan sent to the Keedaa Cola team for recreating SPB’s voice using AI in the film. pic.twitter.com/GyNTD3spgQ
— Aakashavaani (@TheAakashavaani) March 16, 2024
ఇంతకి ఏం జరిగింది?
పెళ్లి చూపులు (Pelli Choopulu) ఫేమ్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) స్వీయ దర్శకత్వంతో వచ్చిన చిత్రం ‘కీడా కోలా’ (Keedaa Cola). బ్రహ్మనందం, చైతన్య రావు, రాగ్ మయుర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు. సరికొత్త క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ దగ్గుబాటి రానా సమర్పణలో నవంబర్ 03న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఎస్పీ బాలు గొంతుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాడించారు. ఇక అనుమతి లేకుండా SPB వాయిస్ వాడుకున్నందుకు గాను ‘కీడా కోలా’ చిత్ర నిర్మాతతో పాటు సంగీత దర్శకుడు వివేక్ సాగర్లకు ఎస్పీ చరణ్ నోటీసులు పంపారు.