Suhas | ‘ఇందులో ఆర్జేగా నటించాను. మామూలు కుర్రాడి పాత్రే. అయితే తనకున్న ఫేస్ బ్లైండ్నెస్ వల్ల ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు? ఆ సమస్యలని ఎలా అధిగమించాడు? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం’ అంటున్నారు నటుడు సుహాస్. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ప్రసన్నవదనం’. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ కథానాయికలు. అర్జున్ వై.కె. దర్శకుడు. జె.ఎస్.మణికంఠ, టి.ఆర్.ప్రసాద్రెడ్డి నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సుహాస్ విలేకరులతో మాట్లాడారు. ‘అర్జున్ చెప్పిన ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ చాలాబాగా నచ్చింది. ఆయన అనుకున్న స్క్రీన్ప్లే, సర్వైవల్ డ్రామా, ైక్లెమాక్స్ అదిరిపోయాయి. అందుకే కథ విన్న వెంటనే చేసేద్దామని ఫిక్స్ అయిపోను. ఈ పాత్ర కోసం పది రోజులు వర్క్ షాప్ చేశాను.
దర్శకుడితో కూర్చుని పాత్ర గురించి, దాని ప్రవర్తన, పరిథుల గురించి తెలుసుకున్న తర్వాతే షూట్కి వెళ్లాను. ఇందులో యాక్షన్ సీక్వెన్స్నైతే సవాలుగా తీసుకొని చేశాను. ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న పాత్ర కావడంతో ఆ సందర్భాల్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలనేది ఛాలెంజ్తో కూడిన విషయమే. సుకుమార్గారి వద్ద ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవం అర్జున్ది. అందుకే అద్భుతంగా తీశాడు.’ అని తెలిపారు సుహాస్. తన ‘కలర్ ఫొటో’ సినిమాకు సహ నిర్మాతగా చేసిన మణికంఠ ఈ సినిమాకు నిర్మాత అని, కాబట్టి ఇది తన హోమ్ బేనర్ అని ఆయన అన్నారు. ‘తొలికాపీ చూశాను. చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇందులో కథానాయికలు పాయల్ రాధాకృష్ణ, రాశీసింగ్ల పాత్రలు కూడా కథలో చాలా కీలకంగా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా ఇది’ అని నమ్మకం వెలిబుచ్చారు సుహాస్.