నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘పంచతంత్ర కథలు’. ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్ పతాకంపై వ్యాపారవేత్త డి.మధు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రంలోని ‘నేనేమో మోతెవరి, నువ్వేమో తోతాపరి..’ అంటూ సాగే పాటను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఈ పాటను కమ్రాన్ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా రామ్ మిర్యాల పాడారు. పాట విడుదల చేసిన అనంతరం తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ..‘ఈ చిత్ర ఫుటేజ్ చూశాను. అప్పుడే ఈ పాట నన్ను ఆకట్టుకుంది. ఈ పాట వైరల్ అవుతుంది. స్ఫూర్తినిచ్చేలా సాగుతుందీ పాట. ప్రతిభ గల నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుంది’ అన్నారు.