నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దర్శకుడు విక్రమ్ కె కుమార్ రూపొందిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. ఈ సినిమా జూలై 22న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఫేర్ వెల్..’ పాటను మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమక్షంలో విడుదల చేశారు. కళాశాల జీవితం నుంచి బయటకొస్తున్న సందర్భంలో రానుందీ పాట. థమన్ స్వరకల్పనలో చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా అర్మాన్ మాలిక్ పాడారు. ఈ పాట విడుదల సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘కళాశాల జీవితాన్ని వదిలేసి వెళ్తున్నప్పుడు మనం ఎంత భావోద్వేగానికి గురవుతామో ఈ పాట ద్వారా చూపిస్తున్నాం. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాడు నాగ చైతన్య. ఆయన ఈ సినిమాలో మూడు వైవిధ్యమైన లుక్స్లో కనిపిస్తారు. దర్శకుడు విక్రమ్ తెరకెక్కించిన మరో ఫీల్గుడ్ సినిమా ఇది. మనం జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుని మనవాళ్లందరికీ థాంక్స్ చెప్పడమే ఈ సినిమా.
మీకు గొప్ప అనూభూతిని అందించే సినిమా అవుతుంది’ అన్నారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ..‘మనందరి జీవితాల్లో కాలేజ్ లైఫ్ చాలా గొప్పది. తర్వాత అంతా ప్రపంచంతో పోటీ పడటమే. ఇక్కడ నేర్చుకున్న విషయాలే మనల్ని జీవితంలో ముందుకు నడిపిస్తాయి. యువత ఎలాంటి సినిమాలు ఇష్టపడతారో అని ప్రతి చిత్రానికీ ఆలోచిస్తుంటాం. నాతో మరో మంచి సినిమా చేసిన దర్శకుడు విక్రమ్కు కృతజ్ఞతలు. విడుదల రోజున మా సినిమా చూడండి. మీ స్పందన సోషల్ మీడియా ద్వారా తెలపండి. మీ ఫీడ్ బ్యాక్ కోసం వేచి చూస్తుంటా’ అన్నారు. సంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ..‘ఈ ఫేర్వెల్ పాట చూశాక మీరంతా ఉద్వేగానికి గురవుతారు. ‘మజిలీ’, ‘థ్యాంక్యూ’ చిత్రాల్లో నాగచైతన్య లుక్స్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో చైతూను చూస్తుంటే నాగార్జునను చూసినట్లు అనిపించింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.