అగ్ర కథానాయకుడు ప్రభాస్ కొత్త సినిమా ‘రాధేశ్యామ్’ అన్ని చోట్ల నుంచీ మంచి స్పందన తెచ్చుకుంటున్నదని అంటున్నారు దర్శకుడు రాధ కృష్ణకుమార్. సంగీత దర్శకుడు థమన్తో కలిసి హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాధ కృష్ణకుమార్ మాట్లాడుతూ…‘మా సినిమాకు ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. రాధేశ్యామ్ విజయంలో సాంకేతిక నిపుణుల పాత్ర చాలా గొప్పది. తెలుగుతో పాటు ఉత్తరాది నుంచి మిగతా రాష్ర్టాల నుంచి సినిమా బాగుందంటూ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఓవర్సీస్లోనూ స్పందన బాగుంది. తొలిరోజు 79 కోట్ల రూపాయలు వసూలు చేసిందని నిర్మాతలు చెప్పడం ఆనందంగా ఉంది. థమన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నది’ అన్నారు. ‘కథా కథనాల్లో, మాటల్లో ఉన్న గొప్పదనమే సినిమాకు మంచి నేపథ్య సంగీతాన్ని అందించేలా చేసింది. ప్రతి సన్నివేశానికీ ఎంతో ఖర్చు పెట్టి చేసిన చిత్రమిది. అంత మంచి సన్నివేశాలు చూసి ఇంకా ఇష్టంతో పనిచేశాం. ఒక అనుభూతిని మిగిల్చిందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థకు హిట్ వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అన్నారు సంగీత దర్శకుడు థమన్.