‘మా సంస్థ నిర్మించిన ‘పుష్ప’ చిత్రానికి అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ను పొందడం ఆనందంగా ఉంది. 69 ఏళ్లలో తొలిసారి ఒక తెలుగు హీరోకి జాతీయ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ఇదొక చరిత్రగా నిలిచిపోతుంది’ అన్నారు నిర్మాత నవీన్ యెర్నేని. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన పుష్ప, ఉప్పెన చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చిన సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ “పుష్ప’ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్కు తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుందని సుకుమార్ గారు అనేవారు.
అది ఈ రోజు నిజమైంది. 69 ఏళ్ల అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న తొలితెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. మాకు ఇంత మంచి సినిమా ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్లకు కృతజ్ఞతలు. అలాగే దేవిశ్రీప్రసాద్కు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ‘ఉప్పెన’ సినిమాకి ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు రావడం గర్వంగా ఉంది’అన్నారు.