సినిమా థియేటర్స్ అసోసియేషన్ (Cinema Theatres Association )పై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Teiugu Film Producers Guild) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు థియేటర్స్ ఓనర్స్ విమర్శలపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ లేఖ విడుదల చేసింది. సినిమాపై పూర్తి హక్కు, అధికారం, హక్కు నిర్మాతలకే ఉంటుందని గిల్డ్ స్పష్టం చేసింది. సినిమా ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలో నిర్మాత ఇష్టం. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్దతి కాదని, వాటి మూలంగా ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటుందని అభిప్రాయపడింది.
ఎగ్జిబిటర్లు డిమాండ్ ఉన్న పెద్ద సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. చిన్న చిత్రాలు, నిర్మాతలను ఎగ్జిబిటర్లు పట్టించుకోవడం లేదని తెలుగు ప్రొడ్యూసర్స్ గిల్డ్ మండిపడ్డది. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కలిసి ఉండాలి. కలిసికట్టుగా పనిచేసి పరిశ్రమ అభివృద్దికి పాటుపడదామని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అందరికీ విజ్ఞప్తి చేసింది. ఓటీటీ ప్లాట్ఫాంలో తన సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో, నిర్మాతను విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం సరికాదు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. తెలుగు పరిశ్రమలో మార్కెట్ ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. అందువల్లే పరిశ్రమ అభివృద్ది చెందుతోంది.
ప్రత్యేకంగా ఒక హీరోను టార్గెట్ చేయడం ద్వారా స్నేహపూర్వక వాతావరణం దెబ్బతింటుంది. నిర్మాతలు, హీరోలు, సాంకేతిక నిపుణులు ఏ సెక్టార్ చేత వెలివేయబడకూడదని గిల్డ్ లేఖలో పేర్కొంది. కొంతకాలం న్యాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ విడుదల విషయంలో వాగ్వాదం నెలకొన్న సంగతి తెలిసిందే. థియేటర్లలో సినిమా విడుదల చేస్తానన్న నాని ఓటీటీలో రిలీజ్ చేయడంపై పలువురు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ లేఖ విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.