ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్కు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో వారు హైదరాబాద్లో పాత్రికేయులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి. కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు పూర్తిగా సహకరిస్తున్నాయని వారు అన్నారు. నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ…‘ఏపీలో టికెట్ రేట్ల పెంపు జీవో విడుదలతో చాలాకాలంగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ఇందుకు ఫిలింఛాంబర్ నుంచి పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాం. చిరంజీవి, ఆర్. నారాయణమూర్తి
వంటివారు మాట్లాడారు. ప్రభుత్వం అర్థం చేసుకుని వ్యవహరించింది. ఆయన ఒప్పుకోకున్నా చిరంజీవి మాకు పెద్దగా భావిస్తున్నాం. త్వరలో తెలుగు చిత్రపరిశ్రమ ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులకు సన్మానం చేయాలని అనుకుంటున్నాం’ అన్నారు.