వైభవ్ సూర్య, రామకృష్ణ, విజయ్, లోహిత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘తెలంగాణ త్యాగధనులు’. ఈ వెబ్ సిరీస్ను విజన్ వీవీకే ఫిలింస్ పతాకంపై వి. విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. నాగబాల సురేష్కుమార్ దర్శకుడు. ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇందులోని ‘వందనం వందనం తెలంగాణ త్యాగధనులకు ఇదే వందనం’ అనే పాటను సీనియర్ నటి రోజా రమణి విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవానికి ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, నిర్మాత విజయ్ కుమార్ క్లాప్ నిచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ…‘చరిత్రలో నిలిచిపోయే కథలు కొన్నే ఉంటాయి.
అలాంటి గుర్తుండిపోయే సబ్జెక్ట్ ఇది. లాభాపేక్ష లేకుండా ఈ వెబ్ సిరీస్ను నిర్మిస్తున్నాను’ అన్నారు. దర్శకుడు నాగబాల సురేష్కుమార్ మాట్లాడుతూ…‘తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులు ఎందరో ఉన్నారు. వారిలో కొందరి జీవిత చరిత్ర ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నాం. ఇది ఎన్ని సీజన్స్, ఎన్ని ఎపిసోడ్స్ అవుతాయో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే తెలంగాణ చరిత్ర చాలా పెద్దది. ఒక ప్రాంతానికి కాకుండా జాతీయ స్థాయిలో తెలియాల్సిన చరిత్ర ఇది. ఇవాళ విడుదల చేసిన ఈ పాటకు వెనిగళ్ల రాంబాబు సాహిత్యాన్ని అందించగా..ఖద్దూస్ సంగీతాన్ని అందించారు’ అన్నారు.