Mohan Babu | తెలంగాణ హైకోర్టులో ప్రముఖ సినీ నటుడు మోహన్బాబుకు చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. విలేకరులపై దాడి కేసులో మోహన్బాబుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు చేయకుండా కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మందస్తు బెయిల్ను కోరారు. మోహన్బాబుకు గుండె, నరాల సమస్యలు ఉన్నాయని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆయన దేశంలో ఉన్నారని కోర్టుకు తెలిపారు.
మోహన్బాబు ఎక్కడకి వెళ్లలేదని.. మనుమరాలు పుట్టిన రోజు వేడుకల కోసం దుబాయి వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు తిరుపతిలో ఉంటున్నట్లుగా న్యాయవాది కోర్టుకు చెప్పారు. అయితే, మోహన్బాబుకు బెయిల్ ఇవ్వొద్దని ఏపీపీ కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు మోహన్బాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దిగువ కోర్టును ఆశ్రయించాలని మోహన్బాబుకు కోర్టు సూచించింది. ఇటీవల జల్పల్లిలోని మోహన్బాబు నివాసం వద్ద ఆయనకు, పెద్ద కొడుకు విష్ణు, మనోజ్ గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడికి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్బాబు దాడి చేశారు. దాంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అరెస్టు చేయకుండా ఆయన కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది.