‘దసరా’ చిత్రం థియేటర్లలో పూనకాలు తెప్పిస్తుంది. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తున్నదని ప్రచార కార్యక్రమాల సందర్భంగా చేసిన పర్యటనలతో అర్థమైంది’ అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దసరా’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్ కథానాయిక. ఈ నెల 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాని మాట్లాడుతూ ‘రిలీజ్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు.
నన్ను, కీర్తి సురేశ్ను మర్చిపోయి మేము పోషించిన ధరణి, వెన్నెల పాత్రల్ని మాత్రమే గుర్తుంచుకుంటారు. ఈ సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ కొత్త ప్రపంచాన్ని చూపించాడు. తెలంగాణలోని వీర్లపల్లి ప్రాంతంతో పాటు పాన్ ఇండియా సెలబ్రేట్ చేసుకునే చిత్రమిది’ అన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన వెన్నెల పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని కథానాయిక కీర్తి సురేశ్ తెలిపింది. నానితో ఈ సినిమా చేయాలని మూడేళ్లుగా ఎదురుచూశామని, దేశమంతా మెచ్చే చిత్రమిదని నిర్మాత సుధాకర్ చెరుకూరి పేర్కొన్నారు. దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘ఈ సినిమా ఒక మాస్టర్ పీస్. నా కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’ అని తెలిపారు. భాషా భేదాలతో సంబంధం లేకుండా అందరు మెచ్చే చిత్రమిదని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలిపారు.