Teja | హనుమాన్,మిరాయ్ వంటి వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన కెరీర్లో తొలి రోజులలో మంచి విజయం సాధించిన ‘జాంబీ రెడ్డి’ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కనున్న జాంబీ రెడ్డి 2 పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ యువ నటి షనాయా కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ‘జాంబీ రెడ్డి 2’లో హీరోయిన్ పాత్ర కోసం షనాయా కపూర్తో చిత్రబృందం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాతోనే ఆమె తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ లేదా షనాయా కపూర్ టీమ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ప్రస్తుతం ఈ వార్తను కేవలం ప్రచారంగానే పరిగణిస్తున్నారు.
2021లో విడుదలైన ‘జాంబీ రెడ్డి’ తెలుగు ప్రేక్షకులకు విభిన్నమైన జాంబీ థ్రిల్లర్ అనుభూతిని అందించింది. హారర్, కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో రూపొందించేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ‘జాంబీ రెడ్డి’కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్కు కథను అందించినట్లు సమాచారం. అయితే రెండో భాగానికి ఆయన దర్శకత్వం వహించరని, మరో దర్శకుడు ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం హీరోయిన్ ఎంపికతో పాటు చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.