‘సినీ పరిశ్రమలో నాకు ఎంతో మంది మిత్రులున్నారు. ఆ పరిచయాలతో వరంగల్లో షూటింగ్స్ జరిగేలా కృషి చేస్తాను. పూరి జగన్నాథ్గారు ఇక్కడ స్టూడియో పెట్టాలని కోరుకుంటున్నా. అందుకోసం అవసరమైతే కేసీఆర్, కేటీఆర్గార్లతో మాట్లాడి భూమి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తా’ అని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆదివారం వరంగల్లో నిర్వహించిన ‘లైగర్’ ఫ్యాన్డమ్ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇండియాలో ఎక్కడకు వెళ్లినా విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. ఆ ప్రేమ తెలంగాణ, ఆంధ్రా ప్రజల దగ్గరే మొదలైంది. మీరిచ్చిన ప్రేమ వల్లే ఇండస్ట్రీలో నిలబడ్డాను. ఈ నెల 25న ఆ ప్రేమను మీకు ఫుల్గా తిరిగి ఇచ్చేస్తా. ఈ సినిమా విజయం మీద ఏమాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా బ్లాక్బస్టరే.
తెలంగాణ, ఆంధ్రలో బాక్సాఫీస్ను షేక్ చేస్తే అది ఇండియా మొత్తం వినబడాలే. ఈ సినిమాలో తల్లీకొడుకులు ఇండియాను షేక్ చేద్దామని కరీంనగర్ నుంచి ముంబయి బయలుదేరుతారు. అదే మాదిరిగా ఈ సినిమా కోసం నేనూ, పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ముంబయి బయలుదేరాం. ఎవరు అడ్డొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా హిట్ కొట్టాల్సిందే అని ఫిక్సైపోయాం. ఈ సినిమాలోని ‘వీ ఆర్ ఇండియన్స్..పోదాం..కొట్లాడదాం..’ అనే డైలాగ్తో నేను బాగా కనెక్ట్ అయ్యా’ అని అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ “అర్జున్ రెడ్డి’ చిత్రంలో విజయ్ యాక్టింగ్ చూసి ఇంత నిజాయితీగా, రియలిస్టిక్గా ఎలా చేశాడని ఆశ్చర్యపోయా. నాకు విజయ్ వ్యక్తిత్వంలోని నిజాయితీ బాగా నచ్చుతుంది. అది ఆయన నటనలో కూడా అది కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి హీరోలు ఉండరు’ అన్నారు. ఛార్మి మాట్లాడుతూ “ఇస్మార్ట్ శంకర్’ నుంచి వరంగల్ మాకు సెంటిమెంట్గా మారింది.
వరంగల్లో ప్రోగ్రామ్ చేస్తే సినిమా సూపర్ హిట్టే అని ఫీలవుతాము’ అని చెప్పింది. కథానాయిక అనన్య పాండే మాట్లాడుతూ ‘మీ అభిమానం, ప్రేమ చూస్తుంటే తెలుగు సినిమా ఫ్యామిలీలో ఓ మెంబర్గా ఉండిపోవాలనిపిస్తున్నది. ‘లైగర్’ రూపంలో ఫుల్ మాస్ కమర్షియల్ సినిమాను ఎంజాయ్ చేస్తారు’ అని పేర్కొంది. ఆలీ మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన తర్వాత తెలంగాణ బిడ్డ బాలీవుడ్, హలీవుడ్లో సత్తా చాటబోతున్నాడని సంబరపడిపోతారు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.