అమరావతి : సినీనటుడు, టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ఆస్పత్రి వైద్యులు మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం తారకరత్నకు ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నామని వివరించారు. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కావడం లేదని, బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కొద్దిసేపు నడిచిన అనంతరం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కళ్లు తిరిగి పడిపోవడంతో హుటాహుటినా అతన్ని కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్రేట్ను పెంచడానికి దాదాపు 45 నిమిషాలపాటు తీవ్రంగా శ్రమించారు. అనంతరం అతడు కోలుకోవడంతో మిగతా పరీక్షలు నిర్వహించి గుండెనాళాల్లో రక్తం పేరుకుపోయిందని గుర్తించి అందుకు తగ్గవిధంగా వైద్య సహాయం అందించారు. వైద్యులు సలహా మేరకు తారకరత్న కుటుంబ సభ్యులు రాత్రి అంబులెన్స్లో బెంగళూరుకు తరలించారు.